Thirumala Temple : రేపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. రేపు జరగాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను పూర్తిగా రద్దుచేశారు. సోమవారం రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. తిరుపతిలో జారీచేసే రేపటి కోటా సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. రేపు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్ల వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఆలయ శుద్ధి, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి.. రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తారు.