తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణపాదాలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.
అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారని, అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాలను పంపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, భక్తులు పాల్గొన్నారు.