తిరుమల : మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ(Ttd) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారని తెలిపారు.భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
తిరుమలలో శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం
తిరుమల(Tirumala) లోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి (Srivani tickets) టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయగా 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.
మార్చి నుంచి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్లైన్లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ (Aadhar)కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారని వెల్లడించారు.