తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల ( Tirumala ) కు చేరుకుంటున్నారు. దీంతో 23 కంపార్ట్మెంట్లు ( Compartments ) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,932 మంది భక్తులు దర్శించుకోగా 25,862 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income ) రూ.4.13 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
30న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 30న తులసి మహత్యం ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఇందులో భాగంగా ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అనంతరం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుందని వివరించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారని వెల్లడించారు.