తిరుమల : రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెరుగుతాయని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం జరిగిన అయోధ్యకాండ పారాయణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతిహాసాలు మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి శాశ్వత మార్గదర్శకాలన్నారు.
కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ పారాయణ యజ్ఞాన్ని మూడు సంవత్సరాలుగా టీటీడీ (TTD) విజయవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు. పారాయణాల ద్వారా ఇతిహాసాల సారాన్ని ప్రపంచానికి అందించాలని ఈవో ఎవి ధర్మారెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. రామాయణం(Ramayanam)లోని పాత్రలు ఆదర్శనీయంగా నిలుస్తాయని అన్నారు.
తండ్రి ప్రేమకు చిహ్నంగా దశరథుడు, శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించే కుమారుడిగా, సీత బాధ్యతాయుతమైన భార్యగా, లక్ష్మణుడు, భరతులు సోదరప్రేమకు ప్రతీకగా, హనుమంతుడిని గొప్ప సేవకునిగా అభివర్ణించారు. రామాయణ, మహాభారతాలు(Mhabharat) అనేక యుగాల తర్వాత కూడా అజరామరంగా ఉండటానికి ఇదే కారణమన్నారు.
ఈవో ఎ.వి.ధర్మా రెడ్డి మాట్లాడుతూ సుందరకాండ, బాలకాండను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 4 వేలకుపైగా శ్లోకాలు గల అయోధ్యాకాండను ప్రారంభించామన్నారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్పా విశ్వనాథ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కేఎస్ఎస్.అవధాని తదితరులు మాట్లాడారు.