తిరుమల : తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) తెలిపారు. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Triumanjanam) నిర్వహిస్తారని వివరించారు.
ఉగాది (Ugadi), ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం (Brahamotsavam) , వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5గంటలపాటు కొనసాగనుందని తెలిపారు. ఈ ఐదు గంటల పాటు భక్తులకు స్వామివారి దర్శనం ఉండదని తెలిపారు.
తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను( Devotees) స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.