తిరుమల : తిరుమల సన్నిధిలో భక్తులకు మరో అతిథిగృహం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఫోనిక్స్ పవర్ అండ్ ఇన్ఫ్రా సంస్థ తిరుమల(Tirumala)లోని సన్నిధానం అతిథి గృహం(Guest House) సమీపంలో నిర్మించిన వేంకటేశ్వర అతిథి గృహాన్ని దాతలు గురువారం టీటీడీ(TTD) కి అప్పగించారు.
12 గదులతో నిర్మించిన ఈ అతిథి గృహం తాళం చెవులను దాతలు సురేష్ చుక్కపల్లి కుటుంబసభ్యులు రమేష్ చుక్కపల్లి, అవినాష్ చుక్కపల్లి, గోపికృష్ణ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
నిన్న స్వామివారిని 80, 284 మంది దర్శించుకోగా 34,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.71 కోట్లు వచ్చిందని వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.