తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ భక్తులతో నిండిపోగా టీబీసీ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు (Tokens)లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 83,889 మంది భక్తులు దర్శించుకోగా 40,495 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.10కోట్లు వచ్చిందని తెలిపారు.
సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు వివరించారు.
తొలిరోజు ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.