తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ అరవింద కుమార్, జస్టిస్ విశ్వనాథ్, హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జడ్జిలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. చైర్మన్ కరుణాకర రెడ్డి వీరికి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు.
పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 18 న నిర్వహించనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను గురువారం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూల్లో , పూడి రోడ్ వద్ద దాదాపు 25 వేల మంది వేచి ఉండేలా జర్మన్ షెడ్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.