తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై శుక్రవారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ నవంబరు 20 నుంచి 28వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఇందుకోసం నవంబరు 19న అంకురార్పణ జరుగుతుందని వెల్లడించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని వివరించారు. పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపుగా వచ్చే మార్గాల్లో అవసరమైన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పుష్కరిణిలోకి విడతలవారీగా భక్తులను అనుమతిస్తామని తెలిపారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, అధికారులు పాల్గొన్నారు.