అనకాపల్లి జిల్లా : నెల రోజులకుపైగా అటు ప్రజలను, ఇటు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి.. తాజాగా బౌలవాడలో ప్రత్యక్షమైంది. ఈ గ్రామంలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపింది. పులి దాడి చిత్రాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎద్దుపై దాడి చేసిన పులి దానిని తిన్నట్లుగా వీడియోలో కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ పులి అనకాపల్లి పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విస్సన్నపేటలో కూడా ఎద్దుపై దాడి చేసినంది.
ఎక్కడి నుంచో వచ్చిన ఈ నాలుగేండ్ల వయసున్న పెద్ద పులి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నది. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దాని జాడలను కనుగొనేందుకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద పులిని పట్టుకునేందుకు అనకాపల్లిలోని బౌలవాడ గ్రామ శివారులో పెద్ద బోనును పెట్టారు. అక్కడే సంచరిస్తున్న పులి.. అక్కడికి సమీపంలో ఓ ఎద్దుపై దాడిచేసి తిన్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. వారం క్రితం కసింకోట మండలంలోని విస్సన్నపేట గ్రామంలో ఓ ఎద్దును చంపింది.
బౌలవాడలో ఎద్దుపై దాడి చేసి చంపిన పులి, దాన్ని సగం వరకు తిన్నదని పెందుర్తిలోని అటవీ సెక్షన్ అధికారి జీ రామారావు తెలిపారు. బాల్వాడ పరిసరాల్లో సంచరించినట్లు దాని అడుగు జాడలను బట్టి గుర్తించామని చెప్పారు. బౌలవాడకు 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఇదే ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పులి పంజా గుర్తులు కనిపించడంతో గ్రామ శివారులో పెద్ద బోనును పెట్టి పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆపరేషన్ కేజ్ విజయవంతం కావడానికి చాలా ఓపిక అవసరమని, ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి వస్తదని తెలిపారు. తొలుత ఈ పెద్ద పులిని తూర్పు గోదావరి జిల్లాలో చూడగా.. తదనంతర రోజుల్లో అది అనకాపల్లి జిల్లాలోని పెద్దపల్లె, యలమంచిలి, కోటారుట్ల, కసింకోట, అనకాపల్లి మండలాల్లో తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.