తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మూడు చోట్ల శ్రీవారి ఆలయాలను ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వెల్లడించారు. మే 4న సీతంపేటలో, మే 22న రంపచోడవరం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ట, జూన్ 4న జమ్ములో శ్రీవారి ఆలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
టీటీడీకి రూ.24 లక్షలు విరాళం
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు భక్తులు రూ.24లక్షలు విరాళంగా అందించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి దాతలు విరాళం డీడీలను అందజేశారు.హైదరాబాదుకు చెందిన ఈవీఎస్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర రూ. 10,00,116 లక్షలు విరాళం అందించారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కేసీ.రెడ్డి, సరోజమ్మ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు వసంత కవిత రూ.2 లక్షలు విరాళంగా అందించారు.
ఆగమోక్తంగా దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.