కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే రమారమి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం చేస్తున్న బడ్జెట్గానే కనిపిస్తుందని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశాడు. అప్పుల చేసి మరీ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అప్పులు చేస్తున్న జగన్.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేటాయించిన నిధులతో ఎన్ఆర్ఈజీఏ, ప్రజాపంపిణీ పథకాలను విజయవంతంగా అమలుచేసిన ఘనత ఏపీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బడ్జెట్పై ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడిగా ఉన్నదని సోము వీర్రాజు దుయ్యబట్టారు. ప్రాంతాల అభివృద్ధి ప్రస్తావన బడ్జెట్లో చూపలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే, భవిష్యత్లో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రాదన్నారు. ఏ రంగానికి కావాల్సినంద నిధులు కేటాయించారో వారే చెప్పలేకపోతున్నారని చెప్పారు. ఈ బడ్జెట్లో ఎక్కువ భాగం నిధులు డైరెక్ట్ బెనిఫిట్ స్కీంల కోసం కేటాయించారని, జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేని స్పష్టమవుతున్నదన్నారు.
ఏపీలో జగన్ ప్రభుత్వానికి అభివృద్ధి కంటే అప్పుల మీదే ధ్యాస ఎక్కువగా ఉన్నదని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ లోటు ఐదు వేల కోట్ల రూపాయలకు చేరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్తో అందరికీ నిధులిచ్చామని, ఈ బడ్జెట్లో ప్రాంతాల వారీగా నిధుల వివరాలు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సోము వీర్రాజు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రస్తుత గ్రామ వాలంటీర్లతో సమానంగా, పార్టీ సమన్వయం, బలోపేతం కోసం రాష్ట్రంలో ఇదే విధమైన నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సోము వీర్రాజు చెప్పారు.