అమరావతి : ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఉప సంహరణపై వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కోసం గత ఏడాదిగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని, మరో వైపు హైకోర్టులో జరుగుతున్న పరిణామాలకు సీఎం వైస్ జగన్ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడమే కాకుండా రెండు రాజధానులు గాని, మరే వ్యతిరేక నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతి రాజధాని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని, శుభం కార్డుకు మరింత సమయముందని మంత్రి పెద్దిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.