తిరుమల: తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పట్టపురాణి అయిన అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు.
మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారని పేర్కొన్నారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నామన్నారు.
అమ్మవారికి జూన్ 13న రాత్రి 8 గంటలకు గజవాహనం, 14న రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తామన్నారని వెల్లడించారు. తెప్పోత్సవాల అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు.
ఆర్జితసేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.