TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్కుమార్కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగింది. దీనిపై మడకశిర టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అతని అనుచరవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తిప్పేస్వామి వర్గానికే టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. ఓ కార్యకర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడు. చంద్రశేఖర్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన తోటి కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సే ఈరన్న మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతోంది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనను కాదని ఈరన్న కొడుకు సునీల్ కుమార్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేయడంతో వీరి మధ్య విభేదాలు బయటకొచ్చాయి. నిజానికి ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో తిప్పేస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది. తమ వర్గానికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకుని వస్తామని గతంలోనే తిప్పేస్వామి చంద్రబాబుకు విన్నవించారు. కానీ టీడీపీ అధినేత ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించారు. తనకు అసలే గిట్టని ఈరన్న వర్గానికి టికెట్ కేటాయించారు. దీంతో తిప్పేస్వామి, అతని అనుచరుల్లో అసమ్మతి నెలకొంది. అప్పటికే అసంతప్తితో ఉన్నారంటే.. తన కుమారుడికి మద్దతు తెలపాలని వారం రోజుల కింద తిప్పేస్వామి ఇంటికి ఈరన్న వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తిప్పేస్వామి వర్గీయులు ఈరన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు పైకి విసిరేస్తూ గో బ్యాక్ అంటే నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అసంతప్తితో ఉన్న తిప్పేస్వామి వర్గీయులు ఇవాళ మరోసారి రెచ్చిపోయారు.
మంగళవారం తిప్పేస్వామి ఇంటికి వెళ్లి ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే తిప్పేస్వామి కూడా స్పందించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని తిప్పేస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా, మడకశిరలో అసమ్మతి సద్దుమణిగిందని టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ వెల్లడించడం విశేషం. టికెట్ ఆశించి రాకపోతే బాధ అనేది సహజంగా ఉంటుందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని.. తిప్పేస్వామిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరానని చెప్పారు.