తిరుమల : ఆంధ్రప్రదేశ్కు చెందిన పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు తిరుమలలో అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. పవిత్ర తిరుమలలో ముఖ్యమైన వ్యక్తులకు ప్రొటోకాల్ ప్రకారం మాత్రమే అధికారులు వారికి దర్శనం కల్పిస్తుండగా ఇవాళ 150 మందితో ఆలయానికి వచ్చి అందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని ఒత్తిడి చేశారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన ఆలయ అధికారులు 20 మంది మంత్రి అనుచరులకు దర్శనభాగ్యం కల్పించారు. మరో వందమందికి బ్రేక్ దర్శనం కల్పించారు.
మంత్రి వైఖరి పట్ల క్యూలో గంటల తరబడి నిల్చున సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని, సామాన్య భక్తుడి మాదిరిగానే క్యూలైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని మంత్రి వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్ కోసం తాను ఒత్తిడి తీసుకురాలేదని, తిరుమలలో అధికార హోదా ప్రదర్శించలేదని స్పష్టం చేశారు.