తిరుమల : గత ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులకు మరోసారి దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టికెట్లు కలిగి దర్శనం చేసుకోలేకపోయిన భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ వారికి ఆరు నెలల్లోపు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు.
అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఉన్న వైకుంఠ ద్వార దర్శనం కారణంగా, ఈ తేదీలు మినహాయించి వారు మరి ఏ తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని సూచించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ కి సహకరించాలని కోరారు.