అమరావతి : ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని,ఎవరి ఉద్యోగం తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandra Babu) పేర్కొన్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు. టీడీపీ ఐఐటీ ఉద్యోగాలు ఇస్తే వైసీపీ కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గంలో సోమవారం నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో బాబు మాట్లాడారు.
తమ పాలనలో రాష్ట్రానికి కియా పరిశ్రమను తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ(TDP) జనసేన కలిసిందని, తమ స్వార్ధం కోసం కాదని స్పష్టం చేశారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. వైఎస్ వివేకానందను హత్య చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
హత్యలకు పాల్పడేది ముఖ్యమంత్రి (Cheif Minister) పదవికి అర్హులు కారని పేర్కొన్నారు. రాజకీయ రౌడిలకు బుద్ధి చెప్పిన పార్టీ టీడీపీ అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పవన్ కల్యాణ్, నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. మూడు రాజధానుల పేరిట రాష్టాన్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.