గుంటూరు: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరుపుకోవడానికి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించిందని, వాటినన్నింటినీ తోసిరాజని ఇంత బ్రహ్మాండమైన సభను జరుపుకుంటున్నామని జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు చెప్పారు. అయితే, ఇప్పటం రైతులు ముందుకు వచ్చి వారి స్థలాల్ని, పొలాల్ని సభ కోసం ఇవ్వడం సంతోషకరమని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్ననన్నారు. ఇప్పటంలో నిర్వహించిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు.
ప్రజల్లో ఒక రకం దొంగలు ఉంటుండగా.. రాజకీయాల్లో మరో రకం దొంగలుంటారని నాగబాబు చెప్పారు. మామూలు దొంగలు మన చిన్న చిన్న వస్తువులను దొంగతనం చేస్తే.. రాజకీయాల్లో ఉండే దొంగలు మన భవిష్యత్ను, మన పిల్లల భవిష్యత్ను, వృత్తిని, ఉద్యోగాలను, చదువులను, ఆరోగ్యాన్ని, వ్యాపారాన్ని, పర్యావరణాన్ని దోచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దొంగలను మనమే దోచుకోమని ఎన్నుకుంటున్నామని, ఇలాంటి దొంగలను మనమే సమర్ధిస్తూ, మనలో మనమే కొట్టుకు చస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ను మూడేండ్లపాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్దే అని దుయ్యబట్టారు. రైతుల అకుంటిత దీక్ష, న్యాయస్థానం అద్భుత తీర్పు, జనసైనికుల పోరాటం కారణంగా అమరావతి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పైకోర్టులకు వెళ్లకుండా కోర్టు తీర్పును శిరసావహించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్న సీఎంగా పరిపాలిస్తే బాగుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే కాందీశీకులుగా పక్క రాష్ట్రంలో స్థిరపడేందుకు చాలా మంది ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్, ఆయన సలహాదారుడు, కొందరు మంత్రులు కాకుండా ఎవరైనా బాగున్నారా అని ప్రశ్నించారు. కొందరైతే మంత్రులమనే విషయం కూడా మరిచిపోతున్నారంటే మీ పాలన ఎలా ఉందో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతీ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉన్నదని ఆరోపించారు. మనందరి బాగు కోసం నిలబడ్డ వ్యక్తే పవన్ కల్యాణ్ అని, తోడపుట్టినా ఆయన నాకూ నాయకుడని చెప్పారు. జనసేప గుండె పవన్ కల్యాణ్, జనసేన పార్టీ జెండా పవన్ కల్యాణ్ అని.. ఆయన దిశానిర్దేశంలో ముందుకు సాగి రాజ్యాధికారం సాధిద్దామని నాగబాబు పిలుపునిచ్చారు.