అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో మంత్రులు నిర్వహిస్తున్నది సామాజిక చైతన్య యాత్ర కాదని నయవంచన యాత్ర అంటూ అనంతపురంలో సామాజిక హక్కుల వేదిక నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తు బస్సు యాత్రను నిర్వహిస్తుందని ఆరోపించారు.
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్, దళితుడు సుబ్రహ్మణ్యంను హత్యచేస్తే దళిత వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి బయట పడడానికి బస్సు యాత్ర పేరిట కొత్త డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టి, ఘర్షణలు చేయించింది అధికార పార్టీ నాయకులేనని ఆరోపించారు. సీఎం జగన్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని విరుచుకు పడ్డారు. ఆదివారం అనంతపురానికి వస్తున్న మంత్రుల బస్సు యాత్రను సామాజిక హక్కుల వేదిక అడ్డుకుంటుందని వెల్లడించారు.