అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు, పార్టీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన తెలిపారు. ఏపీలోని రహదారులు అధ్వానంగా మారడంపై “గుడ్ మార్నింగ్ సీఎం సార్” పేరుతో చేపట్టిన డిజిటల్ క్యాంపెన్ శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో చేతగాని పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.
రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఫ్లకార్డులు కార్డులు పట్టుకుని గుంతల రోడ్డు దుస్థితిని ఆవిష్కరించే వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. నిన్న జనసేన నేతలు, కార్యకర్తలు గుంతల వద్ద ముగ్గులు వేసి కొందరు, మొక్కలు నాటి ఇంకొందరు నిరసనలు తెలిపారు.