అమరావతి: విశాఖలోని రుషికొండపై నిర్మిస్తున్న హరిత రిసార్ట్ పరిశీలనకు వెళ్లిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రిసార్ట్ నిర్మాణాలకు అడ్డగోలుగా రుషికొండను తవ్వేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుండడంతో పాటు హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. నిన్న పరిశీలనకు వెళ్లిన విలేకరులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారు.
దీంతో ఇవాళ సీపీఐ నాయకుడు నారాయణ ఆధ్వర్యంలో రుషికొండకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్థల పరిశీలనకు అభ్యంతరాలేంటో చెప్పాలని నారాయణ పోలీసులను నిలదీశారు. రుషికొండను మొత్తం తవ్వేస్తారా అని ప్రశ్నించారు. రుషికొండను చూస్తామంటే ఎందుకు అడ్డుకుంటు న్నారు. తామేమైనా ఉగ్రవాదులమా అని అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.