హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తాను నియమించింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న హరీశ్కుమార్గుప్తా 1992 క్యాడర్ ఐపీఎస్ అధికారి.
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల ఫిర్యాదులమేరకు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను పంపించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ జాబితా పంపారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్కుమార్గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్ కుమార్గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.