అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు మరోసారి వాయిదా వేసింది. గత 15 రోజులకు పైగా రిమాండ్లో ఉన్న అనంతబాబు తరుఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయడం ఇది రెండోసారి. పిటిషన్పై విచారణను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈనెల 15కి వాయిదా వేసింది.
తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటి నుంచి తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు బాధితుడి కుటుంబ సభ్యులకు వివరించాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మూడు రోజుల పాటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టాయి.
చివరకు పోలీసులు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోగా తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న కారణంగా అతడిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.