Srisailam | శ్రీశైల మహా క్షేత్ర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు ప్రత్యేకంగా పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ముఖ్య సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్శర్మ అన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులైన జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ శనివారం ఉదయం శ్రీశైలం దైవ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటుపై స్థానిక ధార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. శ్రీశైల భ్రామరీ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో జ్వాలాపురం శ్రీకాంత్ శర్మను ఘనంగా సన్మానించి అభినందలు తెలిపారు.
ఈ సందర్భంగా జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ యాత్రికుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్ శర్మ, ప్రవీణ, పాండేశ్వర సుధాకర్ శర్మ, శ్రీయోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమం రాజుస్వామి, నర్సింహాస్వామి, నాగర్కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.