Srisailam | శ్రీగిరిపై దసర నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశామని ఈవో లవన్న తెలిపారు.
నల్లటి ఛాయాదేహంతో జుట్టు విరబూసుకుని భయంకరంగా ఉండే ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకల శుభంకరి అని భక్తుల విశ్వాసం.
ఆది పరాశక్తుల్లో ఏడవ రూపం కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక ( ఇనుప ముండ్లు ) ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభ ప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ దేవిని స్మరించిన మాత్రానే భూత, పేత, పిశాచాదులు భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అర్చకులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనాన్ని అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా విశేష పూజాధి క్రతువులు చేసి వాహనసేవ నిర్వహించారు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థాన సేవ జరిగింది.
గ్రామోత్సవంలో భాగంగా గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారం నుండి మంగళ వాయిద్యాలు కళకారుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కేరళ పంచ వాయిద్యాల మిశ్రమ ధ్వనులు భజనల నడుమ వైభవంగా క్షేత్ర పురవీధుల్లో విహరించారు.
కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి లవన్న, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, మల్లయ్య, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.
అలాగే ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల నృత్యాలు, సంగీత విభావరిని భక్తులు ఆద్యంతం తిలకించారు.
దసరా శరన్నవరాత్రి మహొత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం భ్రమరాంబాదేవి అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామివారు నంది వాహన సేవలో దర్శనం ఇవ్వనున్నారని శ్రీశైలం ఈఓ లవన్న తెలిపారు.