అమరావతి : ఈనెల 30న జరుగనున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు (MLC by-election) నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం (Allaince Government) తప్పుకోవడంతో రంగంలో ఇద్దరే నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) , స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ (Nominations) దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
రెండు నెలల క్రితం ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం అప్పటి మండలి చైర్మన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిని పలు ధపాలుగా పరిశీలించిన మండలి చైర్మన్ చివరకు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలను నిర్వహిస్తుంది.
ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ 600 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు కార్పొరేటర్ల సంఖ్యాబలం ఉంది. కూటమికి 200 పైగా మాత్రమే సభ్యులున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం చివరకు హుందాగా రాజకీయాలు చేద్దామని, ఎవరిని ప్రలోభ పెట్ట వద్దని సూచిస్తూ ఎన్నికల్లో్ పోటీ వద్దంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.