తిరుమల : శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా ’ అంటూ భక్తులు తిరుమల ( Tirumala ) సన్నిధికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని(జనవరి21) 74,056 మంది భక్తులు దర్శించుకోగా 27,517 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.98 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
కాగా, నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. వీటికి సంబంధించిన టెకెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భక్తులు టీటీడీ అధికార వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అలాగే ఈ నెల 25 వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. దీంతో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేశారు. 25 తేదీన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.