అమరావతి : అనకాపల్లి జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ
కూల్చివేతపై తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని ఏపీ హైకోర్టు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి కూల్చివేత ఏమిటని ప్రశ్నించింది. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు ప్రహరీని బందోబస్తు మధ్య కూల్చివేశారు. తమకు అనుమతులున్నాయని కుటుంబ సభ్యులు వివరించినా పట్టించుకోకుండా కూల్చివేతను కొనసాగించడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
కూల్చివేత ప్రక్రియపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అయ్యన్న అనుచరులు గ్రామానికి చేరుకుని నిరసన తెలుపడంతో నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేశ్ హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేయడంతో కోర్టు స్పందించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అయ్యన్న ఇంటిని ముట్టవద్దని స్పష్టం చేసింది.