తిరుమల: శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుంచి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు.
కాగా, మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబు, పేష్కార్ శ్రీహరి, వీజీఓ బాలిరెడ్డి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.