తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. స్వామి వారిని దర్శించి తరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ముందుగా స్వామి, అమ్మవారల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్బాబు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీహరి, వీజీఓ బాలిరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
కాగా, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు నాలుగో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.