విజయనగరం: నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. బోరు బావి వద్ద ఓ వర్గానికి చెందిన బాలుడు నీళ్లు తాగడం వల్లనే ఈ ఘర్షణ చెలరేగిందని పోలీసులు చెప్తున్నారు. గ్రామంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పోలీసులు కాపలా కాస్తున్నారు.
మల్యాడ గ్రామంలో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణలో దాదాపు 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని పోలీసులు స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలోని బీసీ కాలనీలోని బారుబావి వద్ద నీరు తాగిన ఎస్సీ కాలనీకి చెందిన బాలుడిపై బీసీ కాలనీ వాసులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు కూడా అంతే ధీటుగా జవాబిచ్చారు. ఇరువర్గాలు చాలా సేపు కర్రలు, రాళ్లు విసురుకున్నాయి.
కాగా, ఇటీవల జరిగిన ఓ కులాంతర వివాహం కూడా ఈ వివాదానికి కారణమనే వాదన కూడా వినిపిస్తున్నది. అదేవిధంగా, దసరా సమయంలో పాత కక్ష్యలను మనుసులో పెట్టుకుని బీసీ కాలనీవాసులు దాడులకు దిగారని గ్రామస్థులు చెప్తున్నారు. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో మరలా ఉత్రిక్తతకు అవకాశం ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు.