తాడేపల్లి: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత జరిగి మూడేండ్లు అవుతుండటంతో.. నిరసన తెలిపేందుకు మరోసారి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజావేదిక వైపు తరలిరావడాన్ని గమనించిన పోలీసులు.. వారిని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఇతర జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమచారంతో ప్రజావేదిక వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తన నివాసం వద్ద కృష్ణా కరకట్టపై ప్రజావేదికను నిర్మించారు. తర్వాతి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎంగా పగ్గాలు అందుకోగానే.. ప్రజావేదికను కూల్చివేయించాడు. ఈ కూల్చివేత జరిగి సరిగ్గా నేటికి మూడేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శిథిలాల వద్ద నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు వరుసకట్టారు. టీడీపీ నేతల నిరసనల గురించి తెలిసిన వెంటనే పోలీసులు అలర్టయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.
కాగా, సీఎం జగన్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, తెలుగు యువత నాయకులు ప్రజా వేదిక వద్దకు వస్తున్నట్లుగా సమాచారం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. కరకట్ట మీదకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలు సిద్ధం చేశారు. అటువైపు ఎవరు రాకుండా అడ్డుకున్నారు.