అమరావతి : కడప జిల్లాలో రాజంపేట జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాజంపేట జిల్లా సాధన కోసం గుండ్లూరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించేందుకు బయలు దేరిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి, స్థానిక అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది .టీడీపీ నాయకుడు చెంగల రాయుడుని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలను రచించి పాటిన గొప్ప వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటి జిల్లాను ప్రకటించడాన్ని అధికార పక్షంతో పాటు అన్నివర్గాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.