అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే మిషన్ విజయవంతంగా పూర్తయింది. మంగళవారం వచ్చిన 89 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 689 మంది విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకు చెందిన దాదాపు 770 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ, ముంబైకి విద్యార్థులను తీసుకువచ్చి వారి స్వస్థలాలకు తిరిగి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.70 కోట్లతో విద్యార్థుల తరలింపు, వసతి కల్పించారు. ఈ నేపథ్యంలో బుడాపెస్ట్లో స్థానిక భారతీయ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, తెలుగు సంఘాల ప్రతినిధులతో భారత రాయబార కార్యాలయ అధికారులు తుహిన్కుమార్, వెంకట్ మేడపాటి సమావేశమై వారికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే స్థానిక రాయబార కార్యాలయం సహాయంతో వెనక్కి తీసుకుంటామని వెంకట్ మేడపాటి తెలిపారు.
ఇలాఉండగా, కొందరు విద్యార్థులు సొంతంగా రాష్ట్రానికి చేరుకోగా, మరికొందరు రష్యా, ఆస్ట్రేలియాలోని బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే, వివరాలు అందజేస్తే వారిని సురక్షితంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.