బెంగళూరు: స్నేహితులతో సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నది. సెల్ఫీ దిగుతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది. మృతురాలు తిరుపతి వాసి అయిన కట్టా వినీతగా గుర్తించారు. దాంతో తిరుపతిలో ఆమె నివాసం వద్ద విషాదం నెలకొన్నది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన కట్టా వినీత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నది. శని, ఆదివారాలు వారాంతపు సెలవు దినాలు కావడంతో స్నేహితులతో కలిసి ఊటీకి విహారయాత్రకు వెళ్లారు. అక్కడి కల్లాడి నది ఒడ్డున సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ వినీత నీటిలో పడిపోయింది. ఆ సమయంలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఆమె ఒక్క ఉదుటున కొట్టుకుపోయింది.
వినీత నీటిలో పడిపోయిన విషయాన్ని తోటి స్నేహితులు దగ్గరిలోని అధికారులకు తెలియజేశారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది శనివారం తీవ్రంగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. తిరిగి ఆదివారం గజ ఈతగాళ్లతో వెతికించగా.. సాయంత్రానికి ఆమె మృతదేహం లభించింది. వినీత మృతి విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినీత మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం తిరుపతికి తరలించనున్నారు.