తిరుపతి : టీటీడీ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సమష్టి కృషి చేయాలని జేఈవో సదా భార్గవి పిలుపునిచ్చారు. తిరుపతి లోని పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం టీటీడీ విద్యాసంస్థల పై ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే విద్యార్థుల నుంచి మరింత ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చని అన్నారు.
జియో సహకారంతో రూపొందించిన విద్యార్థుల సాఫ్ట్వేర్ను అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని, ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మూడు నెలలే సమయం ఉన్నప్పటికీ, విద్యార్థులకు మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిష్ణాతులైన శిక్షకులను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలోని పుస్తకాలుతెప్పించి వాటిని తెలుగులోకి అనువాదం చేసి బోధించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. శిల్ప కళాశాల కాంపౌండ్ వాల్, ఆర్చి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్వీ సంగీత, నృత్య, నాదస్వర కళాశాలలో వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.
ఎస్వీ డబ్ల్యూపాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ అందించి, వారికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలా వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ మనోహర్, ఎలక్ట్రికల్ డీఈ సరస్వతి తో పాటు వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.