అమరావతి: జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వయసు మళ్లిన తల్లిదండ్రులతో పాటు పాతికేళ్లు కూడా నిండని యువకుడు కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. చేనేతకార్మికులను ఉద్దరించేశామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప.. చేనేతలకు చేసిందేమీ లేదనడానికి తాజా ఘటనే నిలువెత్తు సాక్ష్యం అని పేర్కొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు అందేవి. సొంత మగ్గం లేకపోయినా.. ప్రభుత్వం తరఫున రిబేటు సహా సగటున ఒక్కో కార్మికుడికి ఏడాదికి రూ.లక్ష వరకు సహాయం అందేదని ఆయన వెల్లడిచారు. నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవి. ఆప్కో ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే నేడు నిలిపివేశారు.
మరోవైపు.. గతంలో స్కూల్ పిల్లలకు ఇచ్చే యూనిఫాం చేనేత కార్మికులు,చేనేత సొసైటీల నుంచి తీసుకోవడంతో వారికి సంవత్సరం మొత్తం పని దొరికేది. కానీ..నేడు జగన్ రెడ్డి తన కాసుల కక్కుర్తికి చేనేతలకు ద్రోహం చేసేలా యూనిఫాంను పవర్ లూమ్స్ నుంచి కొనుగోలు చేసేలా ఉత్తర్వులిచ్చి చేనేతల పొట్ట కొట్టారని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.