అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఛార్జీలను పెంచుతూ రాష్ట్రప్రజానికంపై బాదుడే బాదుడు భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ విజయవాడలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఛార్జీల భారంపై ప్రభుత్వ వైఖరిని వివరించారు.
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. పెంచిన ధరలు తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బస్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై బస్టాప్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రధాన బస్టాండ్ ఎదుట రిక్షాలు తొక్కుతూ నిరసన తెలియజేశారు.
పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులపై విపరీతంగా ఛార్జీలు పెంచడం విచారకరమని అన్నారు. సీపీఎం నేతలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస లో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.