ఒంగోలు: కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రులు చెప్తున్నారు. అయితే, దీనిపై ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ వ్యక్తమవుతున్నది. తమ ప్రాంతాన్ని జిల్లాగా మార్చాలంటూ పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు ఊపందుకున్నాయి. కాగా, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా అస్తవ్యస్థంగా ఉన్నదంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాఉండగా, ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం జగన్కే లేఖ రాసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లాల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని ఆగ్రహం వెల్లగక్కారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసి.. అశాస్త్రీయంగా జరిపిన విభజన కారణంగా ప్రకాశం జిల్లా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల ఏర్పాటు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఉదాహరణగా తెలిపారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడం ఎంత మాత్రమూ సమంజసం కాదని, ఆ నియోజకవర్గాన్ని ప్రకాశంలోనే కొనసాగించాలని సూచించారు.
రెవెన్యూ డివిజన్లను 3 గా కాకుండా 6 చేయడం చాలా మంచిదని వారు అభిప్రాయపడ్డారు. జిల్లా విభజన తప్పనిసరి అయితే.. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, మార్కాపురం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా వెనకబడిపోయిన మార్కాపురం అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. జగన్ ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా కూడా వీరు ముగ్గురు జగన్పై లేఖాస్త్రాన్ని సంధించి జిల్లా అభివృద్ధిపై ప్రశ్నించారు.