AP Elections | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ – జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు టికెట్లు దక్కలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు బహిరంగంగానే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు.
నరసరావుపేట అసెంబ్లీ టికెట్ టీడీపీ నాయకుడు చదలవాడ అరవింద బాబుకే ఇవ్వాలని ఆయన మద్దతుదారులు చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అరవింద బాబుకే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోనే పులిమి రామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.