జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నియోజకవర్గానికి ఆహ్వానించారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. మరణించిన కౌలు రైతులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం ప్రకటించిన తర్వాతే.. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహాయం ప్రకటించిందని ఎద్దేవా చేశారు. దీనిని దృష్టిలో వుంచుకునే.. పవన్ తమ పట్టణానికి రావాలని జేసీ ఆహ్వానించారు. ఇలా అయినా… తాడిపత్రి ప్రజలు బాగుపడతారని, ఎంత సేపూ పార్టీ క్షేమమే కాదని, ప్రజల క్షేమం గురించి కూడా తాము ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక తిరుపతిలో జరిగిన తోపులాటపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తీవ్రమైన ఎండా కాలంలో కూడా టీటీడీ భక్తుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు వేంకటేశ్వరుడ్ని దర్శించుకోక రెండు సంవత్సరాలు గడిచిందని,ఈ తాపత్రయంతో భక్తులు వస్తే, భక్తులను అష్టకష్టాలు పెడుతున్నారని విమర్శించారు. ఇక ఇంటి నుంచే వేంకటేశ్వరునికి దండం పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పాలకవర్గం వచ్చిన తర్వాత దర్శనమే గగనమైపోయిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.