Devineni Smitha | పెనమలూరు టీడీపీలో కొత్త పంచాయితీ మొదలయ్యింది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బోడె ప్రసాద్కు టికెట్ ఇవ్వడం పట్ల చలసాని పండు (వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత అసమ్మతి గళం విప్పింది. చంద్రబాబు, నారా లోకేశ్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని మండిపడింది. 2009లోనూ తన తండ్రిని ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని బాధపడింది.
తన తండ్రి మరణం తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారని.. మామగారు చనిపోయిన బాధలో ఉన్న రైతు ర్యాలీ చేపట్టానని దేవినేని స్మిత చెప్పారు. పార్టీ కోసం ఇంత చేసినా 2014, 2019 ఎన్నికల సమయంలోనూ తనకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈసారి టికెట్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. ఇప్పుడు బోడె ప్రసాద్కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసింది తామైతే.. లాబీయింగ్ చేసినవాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. టికెట్ ఎందుకు ఇవ్వలేదో కనీసం పిలిచి కూడా చంద్రబాబు తమకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ప్రకటన అనంతరం చంద్రబాబు, లోకేశ్ అపాయింట్మెంట్ కోసం ఎంతగానో ట్రై చేశామని.. వాట్సాప్లోనూ మెసేజ్లు పెట్టామని అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అన్నారు.
టికెట్ లేదంటే బోడె ప్రసాద్ ఏడ్చాడు.. బ్లాక్మెయిల్ చేశాడు.. మేం బోడేలా చేయలేదు కదా.. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా అని టీడీపీ అధినేతను దేవినేని స్మిత ప్రశ్నించారు. బోడె ప్రసాద్లా బ్లాక్మెయిల్ చేసేవారికే టికెట్ ఇస్తారా? అని మండిపడ్డారు. నా వెనుక ఎవరూ లేరని.. ఆడపిల్లననే ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. విలువ లేని పార్టీ కోసం తామెందుకు పనిచేయాలని మండిపడ్డారు. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.