న్యూఢిల్లీ: సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో వ్యవహారం ఢిల్లీకి చేరింది. అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్లు జరిపారంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి ఈడీ డైరెక్టర్తో భేటీ అయ్యారు. క్యాసినో వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
ఈడీ డైరెక్టర్తో భేటీ అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లో అక్రమంగా క్యాసినో నిర్వహించారని, దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటి సాక్ష్యాలు సేకరించి నివేదికను సిద్ధం చేసిందని తెలిపారు. ఆ నివేదికను ఇవాళ ఈడీకి అందజేశామని తెలిపారు. క్యాసినో నిర్వహణలో రూ.500 కోట్ల బెట్టింగ్, డ్రగ్స్, లిక్కర్, నిషేధిత వస్తువుల వాడకం జరిగినట్లు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
స్వయంగా ఒక మంత్రి తన స్థలంలో క్యాసినో నిర్వహించడం విడ్డూరంగా ఉన్నదని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. నిజనిర్ధారణ జరిపేందుకు వెళ్లిన టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులతో కలిసి వచ్చిన వైసీపీ గుండాలు అడ్డుకున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర పోలీసులు సైతం వైసీపీ కండువా వేసుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.