Chandrababu | సీనియర్ ఎన్టీఆర్ను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగోడి సత్తా చాటుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికై 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. 1983లో ఇదే రోజు ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని చంద్రబాబు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని.. మళ్లీ చరిత్ర పునరావృతం కావాలని ఆకాంక్షించారు.
విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగుజాతి విముక్తి పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ను చంద్రబాబు స్మరించుకున్నారు.
కాగా, చంద్రబాబు చేసిన ట్వీట్పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కొని ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో అది నాభూతో నా భవిష్యత్తు అని ఒకరు కామెంట్ చేయగా.. ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.. మరి మీరు.. ఆయన మీద చెప్పులు వేయించారని మండిపడ్డారు. వెన్నుపోటు పొడిచిన రోజున కూడా ఇలాగే ట్వీట్(ఎక్స్) చేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 41 ఏండ్ల కాలంలో మూడు సార్లు సీఎంగా పనిచేసినా.. చరిత్ర పునరావృతం కాలేదా అని మరొకరు ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ను చంద్రబాబు చేసిన విమర్శలకు సంబంధించిన ఆర్టికల్స్ను కూడా ట్యాగ్ చేశారు.
నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి… pic.twitter.com/rQq2PFsufO
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2024