హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలతో బాబు బెయిల్ కోరగా ఏపీ హైకోర్టు 4 వారాల షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. దీంతో గత 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. ఇద్దరి జామీను, లక్షరూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరుచేసిన జడ్జి జస్టిస్ టీ మల్లికార్జున్రావు పలు షరతులను విధించారు.
చంద్రబాబు తనకు ఇష్టం వచ్చిన దవాఖానలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. కోర్టు విధించిన బెయిల్ షరతుల ప్రకారం చంద్రబాబు తన ఇంట్లో స్వేచ్ఛగా ఉండవచ్చు, చికిత్స కోసం దవాఖానకు వెళ్లవచ్చు. అయితే రాజకీయ సమావేశాల్లో కానీ, మీడియాతో కానీ, నాయకులతో కానీ సమావేశాలలో పాల్గొనరాదు.
బెయిల్ గడువు ముగిసిన అనంతరం నవంబర్ 28న సాయంత్రం ఐదు గంటలలోపు జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. సరెండర్ అయ్యే సమయంలో తన వైద్య చికిత్స సంబంధించిన వివరాలను చంద్రబాబు ఒక సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్కు అందజేయాలని ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్ ఆ కవర్ను ఏసీబీ కోర్టుకు అందజేస్తారని, సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్కు ఈ బెయిల్ అడ్డంకి కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
చంద్రబాబు విడుదల సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు తరలివచ్చారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, నేతలు పయ్యావుల కేశవ్, చింతమనేని ప్రభాకర్, కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు బాబుకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడుతూ.. తన పట్ల తెలుగు ప్రజలు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన అరెస్టును ఖండిస్తూ.. సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి, నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి నుంచి అమరావతి చేరుకొని, అక్కడి నుంచి బాబు హైదరాబాద్ వస్తారని తెలిసింది. చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.