Madhavilatha | ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాడిపత్రిలోని జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే జేసీ బస్సులను దగ్ధమవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాధవీలతపై తాడిపత్రిలో పోలీసు స్టేషన్లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో నిర్వహించిన వేడుకలకు వెళ్లవద్దని న్యూ ఇయర్కు ముందు బీజేపీ నేత మాధవీలత ఒక వీడియో షేర్ చేశారు. జేసీ పార్కులో నిర్వహించే ఈవెంట్లో పాల్గొనవద్దని.. అక్కడ మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. పెన్నా నది ఒడ్డున జేసీ పార్కు వద్ద గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉంటాయని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో మత్తులో వాళ్లు ఏమైనా చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొత్త సంవత్సరంలో పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాధవీలత వ్యాఖ్యల దుమారం చల్లారకముందే.. అంటే జనవరి 2వ తేదీన తెల్లవారిజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ ఇది బీజేపీ నాయకుల పనే అని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కేవలం తన బస్సులను సీజ్ చేయించారని.. కానీ మీరు మాత్రం బస్సులు తగలబెడుతున్నారంటూ బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని.. పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మాధవీలతపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.