తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) పై టీటీడీ పాలకమండలి వేటువేసింది. ఈమేరకు టీటీడీ చైర్మన్ (TTD Chairman) కరుణాకర్ రెడ్డి(Karunakar reddy) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై పాలక మండలి సమావేశంలో చర్చించి ఆయనపై చర్యలకు నిర్ణయించినట్లు చెప్పారు.
పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. తిరుమలలో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రమణ దీక్షితులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి చెందిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు.
గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలను సందర్శించిన సందర్భంగా రమణ దీక్షితులు చేసిన ట్విట్ సంచలనం రేపింది. తిరుమల ఆలయంలో సనాతన ధర్మాన్ని పాటించని ఓ అధికారి, ప్రాచీన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను వ్యవస్థీకృతంగా నాశనం చేస్తున్నారని, దయచేసి ఆలయాన్ని కాపాడాలని కోరారు.