అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పేద మైనార్టీ వివాహలకు అందజేస్తున్న దుల్హన్ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్థిక ఇబ్బందులతో నిలిపివేసినట్లు హైకోర్టుకు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రూ.50వేలు ఆర్థిక సహాయన్ని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అందజేస్తుంది. అయితే దుల్హన్ పథకం నిలిపివేతను సవాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు.
2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ స్కీంను ప్రవేశపెట్టింది. రూ. 50వేలు ఉన్న పరిహారాన్ని లక్షకు పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న సహాయాన్ని ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.ఈ స్కీం ద్వారా విద్యార్థులకు రూ. 15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.13వేలు మాత్రమే ఇస్తున్నామని మంత్రి బొత్స ప్రకటించారు.